Hyderabad: మందెక్కువై నడిరోడ్డుపై యువతుల బాహాబాహీ... తలపట్టుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు!

  • వారాంతాన్ని ఎంజాయ్ చేయాలని బయటకు
  • వివాదం వచ్చి రోడ్డుపైనే గొడవ
  • మహిళా పోలీసులు లేక పోలీసుల అవస్థ

వారందరూ డబ్బున్న ఇంటి బిడ్డలే. వారాంతాన్ని ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో నిన్న రాత్రి బయటకు వచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ పబ్ లో పూటుగా మందు కొట్టారు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో... రోడ్డుపై బాహాబాహీకి దిగారు. పొట్టిపొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలు, రోడ్డుపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటుంటే, అక్కడ వందలాది మంది పోగయ్యారు. ఈ ఘటన నిన్న రాత్రి ఒంటిగంట ప్రాంతంలో కేబీఆర్ పార్క్ వద్ద జరిగింది.

ఇప్పటికే హైదరాబాద్ లోని పబ్ ల వద్ద న్యూసెన్స్ పెరిగిపోయిందని, వారాంతం వస్తే గొడవలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న వేళ, వాటిని నిజం చేసిన ఘటన ఇది. ఓ అమ్మాయి తన చివరి పెగ్ గా చెప్పుకున్న మద్యాన్ని మరో అమ్మాయి తాగడమే మొత్తం గొడవకు కారణమని సమాచారం. రోడ్డుపై అమ్మాయిలు గొడవ పడుతుంటే, తెలుసుకుని వచ్చిన ట్రాఫిక్ పోలీసులు, వారిని అదుపు చేసేందుకు మహిళా పోలీసులు లేక, తలపట్టుకోవాల్సి వచ్చింది. చివరకు లేడీ కానిస్టేబుళ్లను పిలిపించి, వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

కాగా, నిన్న రాత్రి జరిగిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలో దాదాపు 40 మందికి పైగా పట్టుబడ్డారు. ఓ నైజీరియన్ మాత్రం తనిఖీలకు సహకరించకుండా నానాయాగీ చేశాడు.

More Telugu News