CM jagan: ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో.. విశాఖ బ్లడ్‌క్యాన్సర్‌ బాలుడికి అందుతున్న వైద్యం

  • ఇచ్చిన మాట మేరకు ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్‌
  • నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం
  • పూర్తి స్థాయి వైద్యం అందించాలని ఆదేశం

తమ మిత్రుడి ప్రాణాలు కాపాడుకునేందుకు విద్యార్థుల ప్రయత్నం ఫలితమిచ్చింది. బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి స్నేహితుడికి ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందుతోంది. వివరాల్లోకి వెళితే...విశాఖ నగరం జ్ఞానాపురానికి చెందిన నీరజ్‌కుమార్‌ ప్రాణాంతక బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. సాధారణ కుటుంబీకులైన తల్లిదండ్రులు కొడుకు స్థితి చూసి తల్లిడిల్లిపోయారు. ఆసుపత్రికి వెళితే ఏకంగా రూ.25 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో హతాశులయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఈనెల 4వ తేదీన జగన్ విశాఖ శారదా పీఠానికి విచ్చేశారు. ఆయన తిరుగు ప్రయాణంలో విశాఖ విమానాశ్రయం వద్ద మిత్రులంతా ‘సేవ్‌ అవర్‌ ఫ్రెండ్‌‘ అని ఉన్న బ్యానర్లు పట్టుకుని నిల్చున్నారు.

కారులోంచి బ్యానర్‌ చూసిన ముఖ్యమంత్రి కారు దిగి వారితో మాట్లాడారు. విషయం తెలుసుకుని ఓదార్చారు. నీరజ్‌కుమార్‌ వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని అక్కడికక్కడే మాటిచ్చారు. ఈ మాట మేరకు ఇప్పటికే నీరజ్‌ వైద్యం కోసం ప్రభుత్వం రూ.10 లక్షలు విడుదల చేసింది. ఇంకా ఎంతమొత్తమైనా ప్రభుత్వం సమకూర్చుతుందని కుటుంబ సభ్యులకు, ఆసుపత్రి వర్గాలకు ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి. నీరజ్‌కు అందుతున్న వైద్యంను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు.

More Telugu News