Andhra Pradesh: పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని.. పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య!

  • పశ్చిమగోదావరి జిల్లాలో ఘటన
  • ప్రేమించుకున్న శేఖర్, యువతి
  • ప్రేమికులను ఆసుపత్రికి తరలించిన లాడ్జీ యజమాని

పెద్దలు వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట తీవ్ర నిర్ణయం తీసుకుంది. కలిసి బతకలేపోయినా, కలిసి చనిపోవాలని భావించింది. అనుకున్నదే తడవుగా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం నూతిరామన్నపాలెం గ్రామానికి చెందిన నాగంపల్లి శేఖర్, అదే ఊరికి చెందిన మరో యువతి ప్రేమించుకున్నారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబాలు వివాహానికి అంగీకరించలేదు. దీంతో యువతీయువకులు మనస్తాపానికి లోనయ్యారు. ఒకరు లేకుండా మరొకరు జీవించలేమని భావించి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలోని గురవాయిగూడెంలోని ఓ లాడ్జీలో గది తీసుకున్నారు.

అనంతరం వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిని గుర్తించిన లాడ్జి యజమాని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శేఖర్ చనిపోగా, యువతి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News