England: స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడిన ఇంగ్లండ్.. శ్రీలంక విజయం

  • ఇంగ్లండ్‌ను దారుణంగా దెబ్బ కొట్టిన మలింగ
  • బెన్‌స్టోక్స్ పోరాటం వృథా
  • ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా మలింగ

ప్రపంచకప్‌లో భాగంగా లీడ్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఈ ప్రపంచకప్‌లో భారీ స్కోర్లను అలవోకగా బాదేస్తున్న ఇంగ్లండ్.. ప్రత్యర్థి నిర్దేశించిన స్వల్ప విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆపసోపాలు పడి చివరికి మరో 20 పరుగుల ముందే చేతులెత్తేసి ఓటమి పాలైంది.

శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ, ధనంజయ డి సిల్వా దెబ్బకు కకావికలైన ఇంగ్లండ్ ఓటమిని తప్పించుకోలేకపోయింది. జో రూట్ (57), బెన్ స్టోక్స్ (82-నాటౌట్)లు కాసేపు ప్రతిఘటించినా పరాజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. మలింగ 4, డి సిల్వా 3 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. దీంతో మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే 212 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.

అంతకుముందు శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. జోఫ్రా అర్చర్, మార్క్‌వుడ్‌లు పోటీలు పడి వికెట్లు తీయడంతో శ్రీలంక ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. అవిష్క ఫెర్నాండో (49), కుశాల్ మెండిస్ (46), ఏంజెలో మాథ్యూస్ (85) రాణించడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మలింగకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

More Telugu News