Telugudesam: ఆ నలుగురు చంద్రబాబు కాళ్లు పట్టుకుని ఎంపీలయ్యారు: దేవినేని అవినాష్

  • టీడీపీ, చంద్రబాబుపై వారి మాటలు సిగ్గుచేటు
  • వీళ్లు బయటకు పోవడంతో టీడీపీకి పట్టిన శని పోయింది
  • టీడీపీకు, చంద్రబాబుకు రక్షణ గోడలా ఉంటాం

బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలపై తెలుగుదేశం పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ యువనేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ, టీడీపీని వీడిన ఆ నలుగురు చంద్రబాబు కాళ్లు పట్టుకుని ఎంపీలు అయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, చంద్రబాబు గురించి వారు మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఇంత కన్నా సిగ్గుచేటు విషయం ఇంకేమైనా ఉందా అనిపిస్తోందని అన్నారు.

గత ఐదేళ్లలో వారు చేసిన అవినీతి, అక్రమాలు బయటపడకుండా చూసుకునేందుకు, మళ్లీ దోచుకున్నదంతా కాపాడుకోవాలని చెప్పి బీజేపీలో చేరారని ఆరోపించారు. ఈ నలుగురు పార్టీని వీడటం వల్ల తెలుగుదేశానికి పట్టిన శని పోయిందని ప్రతి కార్యకర్త సంతోషిస్తున్నారని అన్నారు. బుద్ధా వెంకన్నకు, పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని చెప్పారు. టీడీపీకు, చంద్రబాబుకు రక్షణ గోడలా తాము ఉంటామని, కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

 టీడీపీ తరపున రాజ్యసభ ఎంపీలు అయిన వీళ్లు ఆ పదవులకు రాజీనామా చేయాలని, మోదీ కాళ్లు పట్టుకుంటారో, అమిత్ షా కాళ్లు పట్టుకుంటారో పట్టుకుని పదవులు సంపాదించుకోండని పార్టీ వీడిన టీడీపీ ఎంపీలపై ఓ రేంజ్ లో ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ పైనా ఆయన మండిపడ్డారు. తమ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని, తిరగబడతామని హెచ్చరించారు.

More Telugu News