Vijay Sai Reddy: 'విజయసాయి నివాసంలో సుజనా, సీఎం రమేశ్ భోజనం' అంటూ ప్రచారం.. అసలు విషయం ఇదే..!

  • మాజీ స్పీకర్ గౌరవార్థం ఢిల్లీలో ప్రధాని విందు కార్యక్రమం
  • పక్కపక్కనే కూర్చున్న తెలుగు ఎంపీలు
  • సోషల్ మీడియాలో వైరల్

ఇప్పుడు ఎక్కడ చూసినా నలుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం గురించే చర్చించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో అయితే ఇదే ప్రధాన అజెండాగా మారిపోయింది. అయితే, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడం వరకు అంతా విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే సాగిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు నిదర్శనం ఇదేనంటూ, విజయసాయి పక్కన కూర్చుని ఉండగా సీఎం రమేశ్, సుజనా చౌదరి భోజనం చేస్తున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.

ఇది విజయసాయి తన నివాసంలో ఇచ్చిన విందు అని, టీడీపీ నేతలను ఆయనే ఫిరాయింపులకు ప్రోత్సహించారంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే, అసలు విషయం ఏంటంటే, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విందు ఏర్పాటు చేయగా, తెలుగు ఎంపీలందరూ పక్కపక్కనే ఆసీనులయ్యారు. విజయసాయి పక్కనే సీఎం రమేశ్, సుజనా కూర్చున్నారు. దాంతో, విజయసాయి ఇచ్చిన విందుగా పేర్కొంటూ అవే ఫొటోలను ఆయన నివాసంలోనివిగా సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.

More Telugu News