sikkim: సిక్కింలో భారీ వర్షాలు...ఉత్తర ప్రాంతంలో చిక్కుకుపోయిన పర్యాటకులు

  • కొండచరియలు విరిగిపడడంతో నిలిచిపోయిన రాకపోకలు
  • చిన్‌, జిమా మధ్య చిక్కుకున్న 60 పర్యాటక వాహనాలు
  • నాలుగు రోజుల తర్వాత రక్షించిన అధికారులు

భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా ఉత్తర సిక్కింలో నాలుగు రోజులుగా చిక్కుకుపోయిన పర్యాటకులను నిన్నరాత్రి అధికారులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. కొద్ది రోజులుగా సిక్కిం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. హఠాత్తుగా మొదలైన భారీ వర్షాల కారణంగా తీస్తా నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఘాట్‌ రోడ్లలో కొండ చరియలు విరిగి పడడంతో చిన్‌, జిమా మధ్య పర్యాటకులను తీసుకువెళ్లిన అరవై వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి.

వీటిలో ప్రయాణించిన మొత్తం 427 మంది పర్యాటకులు నాలుగు రోజులుగా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు కాస్త తెరిపివ్వడంతో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు నిన్నరాత్రికి రోడ్లకు మరమ్మతులు జరిపి వాహనాల రాకపోకలకు వీలు కలిగించడంతో వీరందరికీ మోక్షం కలిగింది. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసుల సహాయంతో పర్యాటకులకు వైద్య, ఇతర సహాయాలు అందిస్తున్నట్లు ఉత్తర సిక్కిం కలెక్టర్‌ రాజ్‌యాదవ్‌ తెలిపారు.

More Telugu News