Telangana: బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతితో అసత్యాలు పలికించింది: టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్

  • రాష్ట్రపతి ప్రసంగంపై ఉత్తమ్ విమర్శలు
  • విభజన చట్టంలోని అంశాలపై ప్రస్తావించలేదు
  • రామ్ నాథ్ ప్రసంగం బీజేపీని పొగడటానికే సరిపోయింది

ఈరోజు ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేసిన ప్రసంగంపై టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగం చాలా పేలవంగా ఉందని, బీజేపీని పొగడటానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రపతి ప్రసంగంలో విభజన చట్టంలోని అంశాలు, దేశంలో నిరుద్యోగ సమస్య, రైతు సమస్యల గురించిన ప్రస్తావనే లేదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతితో అసత్యాలు పలికించిందని అన్నారు. 2014 కంటే ముందు ప్రభుత్వాలు అస్థిరమైన ప్రభుత్వాలని రామ్ నాథ్ తో అనిపించడం బాధాకరమని, యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు కచ్చితంగా స్థిరమైనవి అన్న విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి అందరికీ తెలుసని చెప్పారు.

More Telugu News