AN-32: ఏఎన్-32 వాయుసేన విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు లభ్యం

  • ఈ నెల 11న విమాన ప్రమాదం
  • టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఏఎన్-32
  • మృతదేహాలను ఎయిర్ బేస్ కు చేర్చిన అధికారులు

ఈ నెల 11వ తేదీన అసోంలోని వాయుసేన ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ తీసుకుని, నిమిషాల వ్యవధిలోనే కూలిపోయిన ఏఎన్ -32 విమానంలో ప్రయాణించిన వారిలో ఆరుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగతా ఏడుగురి శరీర భాగాలు లభ్యమయ్యాయని తెలిపారు. సముద్ర మట్టానికి దాదాపు 12 వేల అడుగుల ఎత్తులో వీరి శరీర భాగాలు చెల్లాచెదరుగా పడివున్నాయని అధికారులు తెలిపారు.

రష్యాలో తయారైన ఈ టర్బోప్రాప్ ట్రాన్స్ పోర్ట్ విమానం, అసోంలోని జోర్హాట్ నుంచి మేచుకాకు బయలుదేరి కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆపై రెండు రోజుల తరువాత విమానంలోని అందరూ మరణించారని అధికారిక ప్రకటన వెలువడింది. జోర్హాట్ లోని ఎయిర్ బేస్ కు మృతదేహాలు, శరీర భాగాలను చేర్చామని, వాటిని బంధువులకు అప్పగించనున్నామని ఓ అధికారి తెలిపారు. విమానంలోని సీవీఆర్ (కాక్ పీట్ వాయిస్ రికార్డర్), బ్లాక్ బాక్స్ లను గతవారంలోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాల్లో విమానం కూలిన కారణంగానే, విమానాన్ని గుర్తించడంలోనూ, మృతదేహాలను వెలికి తేవడంలోనూ ఆలస్యం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.

More Telugu News