Telecom: చోరీకి గురైన మీ ఫోన్ ను బ్లాక్ చేయచ్చు.. ఐఎంఈఐ డేటాబేస్ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

  • సీఈఐఆర్ పేరుతో అతిపెద్ద డేటాబేస్
  • ఫిర్యాదు చేస్తే మొబైల్‌ని ట్రాక్ చేసి బ్లాక్‌లిస్ట్
  • భవిష్యత్తులోనూ ఆ ఫోన్ పనిచేయకుండా బ్లాక్

పొరపాటున పోగొట్టుకున్నా, చోరీకి గురైనా మన మొబైల్ ఫోన్‌పై ఆశ వదులుకోవాల్సిందే. అది ఎంత ఖరీదైనదైనా తిరిగి మన చెంతకు చేరడం దాదాపు అసాధ్యం. అయితే, ఇకపై అలాంటి భయం లేకుండా ప్రభుత్వం ఓ డేటాబేస్‌ను తయారుచేస్తోంది. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజస్టర్ (సీఈఐఆర్) పేరుతో ఐఎంఈఐ నంబర్లతో టెలికం శాఖ ఓ డేటాబేస్‌ను రూపొందిస్తోంది. ఇందులో వినియోగంలో ఉన్న ప్రతీ మొబైల్‌కు సంబంధించిన 15 అంకెల మొబైల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఐఎంఈఐ) ఉంటుంది.

మరికొన్ని వారాల్లోనే ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎవరైనా తమ ఫోన్‌ను పోగొట్టుకున్నా, లేదంటే చోరీకి గురైనా వెంటనే హెల్ప్‌లైన్ నంబరు ద్వారా టెలికం శాఖకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందుకున్న వెంటనే టెలికం శాఖ బాధితుల ఐఎంఈఐ నంబరును ట్రాక్ చేసి బ్లాక్‌లిస్ట్‌లో పెడుతుంది. అంతేకాదు, భవిష్యత్తులో ఆ ఫోన్‌లో మరే ఇతర టెలికం నెట్‌వర్క్‌లు పనిచేయకుండా చేస్తుందని, దీని ద్వారా ఫోన్ల చోరీని అరికట్టవచ్చని టెలికం శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో 1.16 బిలియన్ల మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు.

More Telugu News