Andhra Pradesh: ఏపీలో పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు.. హ్యాట్సాఫ్!: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కితాబు

  • ఆర్టీసీ విలీనంపై పెద్దవాళ్లు నిర్ణయం తీసుకున్నారు
  • ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాం
  • అనంతపురంలో మీడియాతో టీడీపీ నేత

పెద్దపెద్దవాళ్లు కూర్చుని ఏపీఎస్ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారని, దివాకర్ ట్రావెల్స్ అధినేతగా దీనిపై తాను కామెంట్ చేయబోనని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మంచి జరగాలనే కోరుకుంటున్నామని చెప్పారు. ఏపీలో కాకుంటే ముంబై, చెన్నై, బెంగళూరుకు సర్వీసులు తిప్పుకుంటామని తేల్చిచెప్పారు. అనంతపురం జిల్లాలో ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఇటీవల అనంతపురంలో టీడీపీ నేతల చీనీ తోటలను నరికివేయడం, రాష్ట్రంలో శాంతిభద్రతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ..‘వాస్తవం చెప్పాలంటే ఎప్పుడూ లేనివిధంగా పోలీస్ శాఖ పనిచేస్తోంది. పోలీస్ శాఖకు నేను హ్యాట్సాఫ్ చెబుతున్నా. వాళ్లు ఎంతబాగా పనిచేస్తున్నారో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. ప్రజలంతా చల్లగా బతుకుతున్నారంటే పోలీసుల వల్లే’ అని ప్రశంసించారు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజల కోసమే తాను ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నానని జేసీ చెప్పారు.

More Telugu News