Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్!

  • కశ్మీర్ లోని షోపియాన్ లో ఘటన
  • నిఘావర్గాల సమాచారంతో మెరుపుదాడులు
  • బలగాల కాన్వాయ్ పై దాడికోసం ఐఈడీని తయారుచేసిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్ లో ఈరోజు భారీ ఉగ్ర కుట్రను భద్రతాబలగాలు భగ్నం చేశాయి. షోపియాన్ జిల్లాలోని ఓ ఇంటిలో ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతా బలగాలను నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల కాన్వాయ్ లక్ష్యంగా వీరు దాడులకు పాల్పడే అవకాశముందని సమాచారం అందించాయి. దీంతో వెంటనే అప్రమత్తమయిన బలగాలు ఈరోజు ఒక్కసారిగా ఉగ్రవాదులు నక్కిన ఇంటిపై మెరుపుదాడులు నిర్వహించాయి.

ఈ సందర్భంగా హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు సజీవంగా పట్టుకున్నాయి. భూమిలో అమర్చడానికి సిద్ధం చేసిన శక్తిమంతమైన ఐఈడీ(అత్యాధునిక పేలుడు పదార్థం)ని స్వాధీనం చేసుకున్నారు. భద్రతాబలగాలు రాకపోకలు సాగించే రోడ్డుపై ఈ ఐఈడీని అమర్చేందుకు ఉగ్రమూకలు కుట్ర పన్నాయని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పక్కా నిఘా సమాచారంతో ఈ కుట్రను భగ్నం చేశామని పేర్కొన్నారు.

More Telugu News