uk: ‘అరటి పండు’తో బెదిరించి, బ్యాంకులో దొంగతనం.. కారణం విని అవాక్కయిన పోలీసులు!

  • ఇంగ్లండ్ లోని బౌర్నేమౌత్ లో ఘటన
  • ఇంటి నుంచి జేమ్స్ ను గెంటివేసిన ఓనర్
  • 1000 పౌండ్లు దొంగలించిన జేమ్స్

అద్దె చెల్లించలేకపోవడంతో ఇంటి ఓనర్ బయటకు గెంటేశాడు. ఓపక్క తీవ్రమైన చలి. ఏం చేయాలని తెగ ఆలోచించిన అతను కేవలం ఓ అరటి పండు సాయంతో బ్యాంకును దోపిడీ చేశాడు. అనంతరం పోలీసుల దగ్గరకు వెళ్లి స్వయంగా లొంగిపోయాడు. ఇంగ్లండ్ లో మే 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇంగ్లండ్ లోని బౌర్నేమౌత్ ప్రాంతానికి చెందిన లౌరెన్స్ జేమ్స్ వండర్ డెల్ అద్దె చెల్లించలేకపోవడంతో ఓనర్ ఇంటిని ఖాళీ చేయించాడు. దీంతో చలిలో నిలువనీడ లేకుండాపోయిన జేమ్స్.. ఎక్కడయినా ఆశ్రయం పొందాలని భావించాడు. అనుకున్నదే తడవుగా అరటిపండును కొని, ఓ నల్లటి కవర్ కప్పాడు. అనంతరం గత నెల 25న నేషనల్ వైడ్ బ్యాంకుకు వెళ్లాడు. అయితే అక్కడ కస్టమర్లు ఎక్కువగా ఉండటంతో బౌర్నేమౌత్ లోని బర్క్లేస్ బ్యాంకు బ్రాంచ్ కు చేరుకున్నాడు.

క్యాషియర్ దగ్గరకు మర్యాదగా వెళ్లి కవర్ కప్పిన అరటిపండును అతనివైపు గురిపెట్టాడు. ‘నా దగ్గర తుపాకీ ఉంది.. మర్యాదగా నగదు ఇవ్వు’ అని హెచ్చరించాడు. దీంతో ఆ క్యాషియర్ 1000 పౌండ్లను కవర్ లో పెట్టి ఇచ్చేశాడు. దాన్ని తీసుకున్న జేమ్స్ నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లి మొత్తం విషయం చెప్పాడు.

అయితే ఇక్కడ కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు జేమ్స్ కు సలహా ఇచ్చారు. దీంతో నిందితుడు స్వయంగా వెళ్లి స్థానిక పోలీసులకు లొంగిపోయాడు. జైలులో అయితే, అద్దె గిద్దె లాంటి బాదరబందీ ఉండదని, ఎంచక్కా ఆశ్రయం పొందవచ్చన్న ఆశతోనే దొంగతనం చేశానని జేమ్స్ చెప్పిన మాటలు విన్న పోలీసులు అవాక్కయ్యారు. ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన జడ్జి రాబర్ట్ పాసన్ జేమ్స్ కు 14 నెలల జైలుశిక్ష విధించారు.

More Telugu News