Vijayashanti: కేసీఆర్ మనసు మారడం వెనుక ఇంత రహస్యమా?... విని ఆశ్చర్యపోయానన్న విజయశాంతి!

  • సచివాలయం విషయంలో మారిన కేసీఆర్ మైండ్ సెట్
  • ఎందుకు మనసు మార్చుకున్నారో కొందరు చెప్పారు
  • ఫేస్ బుక్ లో విజయశాంతి సుదీర్ఘ పోస్ట్

తెలంగాణ సెక్రటేరియేట్ విషయంలో కేసీఆర్ మైండ్ సెట్ మారడం వెనుక ఎంతో రహస్యం దాగుందని, దాని గురించి స్వయంగా టీఆర్ఎస్ నాయకులు చెబితే తాను ఎంతో ఆశ్చర్యపోయానని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టిన ఆమె, కేసీఆర్ మాట మార్చారని దుయ్యబట్టారు. విజయశాంతి పోస్ట్ యథాతథంగా...

"నిన్నటి వరకు సచివాలయ ప్రాంగణాన్ని బైసన్ పోలో గ్రౌండ్ కు తరలిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతూ వచ్చారు. తెలంగాణకు సంబంధించిన విభజన సమస్యలు చాలా పెండింగులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోని బైసన్ గ్రౌండ్ కోసం కెసిఆర్ గారు తెగ పైరవీలు చేశారు. ఎట్టకేలకు కేసీఆర్ గారు చేసే ప్రయత్నం ఫలించింది. ఆయన రెండోసారి సీఎం అయిన వెంటనే కేంద్రం కూడా కెసిఆర్ గారి కోరిక మేరకు టిఆర్ఎస్ ప్రభుత్వానికి బైసన్పోలో గ్రౌండ్ అప్పగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతా సజావుగా జరిగింది అనుకుంటున్న తరుణంలో కేసీఆర్ గారి మైండ్ సెట్ సడన్ గా మారిపోయింది. బైసన్పోలో గ్రౌండ్ వద్దు... పాత సచివాలయ ప్రాంగణం ముద్దు అని కొత్త పల్లవి అందుకున్నారు.

అంతగా కావాలంటే పాత సచివాలయ బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేస్తామని కెసిఆర్ ఇప్పుడు చెప్తున్నారు. కెసిఆర్ గారి మైండ్ సెట్ అకస్మాత్తుగా మారడం వెనుక అసలు రహస్యం ఒకటి ఉందని ఇటీవల కలిసిన టిఆర్ఎస్ నేతలు కొందరు నాతో చెప్పిన మాటలు విని ఆశ్చర్యం కలిగింది. బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయాన్ని నిర్మించడానికి తలపెట్టి, శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న వెంటనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కొత్త సచివాలయంలో కి వెళ్లిన వెంటనే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ కలలు కన్నారని గులాబీ నేతలు నాతో చెప్పారు. తీరా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి చావు తప్పి, కన్ను లొట్టపోయిన విధంగా కెసిఆర్ గారి పరిస్థితి మారింది. దీంతో టిఆర్ఎస్ ఉనికి రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది అనే ఆలోచన కేసిఆర్ లో మొదలయ్యింది.

బైసన్ పోలో గ్రౌండ్ లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టిన రోజు నుంచి తన వ్యూహాలన్నీ బెడిసి కొడుతున్నాయి అని కెసిఆర్ లో ఆందోళన మొదలైనట్లు టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దాంతో పాత సచివాలయ ప్రాంగణం లోనే పునర్నిర్మాణం చేసి ,డిజైన్ మార్చాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.ఇలాంటి వింతలు, విడ్డూరాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందోనని తెలంగాణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాన్ని మార్చే మాటేమోగాని.... కెసిఆర్ గారి మైండ్ సెట్ మారకపోతే, సీఎం పదవి నుంచి ఆయనను మార్చడానికి తెలంగాణ ప్రజలు వెనుకాడరు అనే విషయాన్ని టిఆర్ఎస్ అధిష్టానం గుర్తించాలి" అని ఆమె అన్నారు.

More Telugu News