East Godavari District: కాకినాడలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం

  • అర్ధరాత్రి అకస్మాత్తుగా ఎగసిపడిన అగ్ని కీలలు
  • సూపర్ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం
  • బూడిదైన మూడు అంతస్తులు

మంగళవారం అర్ధరాత్రి దాటాక కాకినాడలోని గ్లాస్‌హౌస్ సెంటర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో రూ.2 కోట్ల ఆస్తి బుగ్గిపాలైంది. సూపర్ మార్కెట్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు శకటాలతో  ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

అయితే, పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో పెద్దాపురం, పిఠాపురం నుంచి మరో నాలుగు శకటాలను రప్పించారు. కొన్ని గంటలపాటు శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. సూపర్ మార్కెట్‌లో ప్లాస్టిక్, స్కూలు బ్యాగులు, బట్టల దుకాణాలు ఉండడంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ భవనానికి ఎటువంటి భద్రతా ప్రమాణాలు లేవని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.  

More Telugu News