Avanti Srinivas: ఆ మాట చెప్పిన ఏకైక దమ్మున్న వ్యక్తి జగన్ ఒక్కరే: అవంతి శ్రీనివాస్

  • ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకోనన్నారు 
  • ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు
  • చంద్రబాబైతే అలా చేసేవారు కాదన్న అవంతి శ్రీనివాస్

ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఆహ్వానించబోనని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీలో గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన, అదే జగన్ స్థానంలో చంద్రబాబు ఉంటే, ఉన్న 23 ఎమ్మెల్యేలను 13కు ఎలా చేర్చాలా అని ఆలోచనలు చేసుండేవారని ఎద్దేవా చేశారు.

నవరత్నాలను కాపీ కొట్టాలని ప్రయత్నించినందునే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని, పోలవరం ప్రాజెక్టులో జరిపిన అవినీతిని తమ ప్రభుత్వం ప్రజల ముందు బయట పెట్టనుందని అన్నారు. ప్రభుత్వం నియమించే కమిటీ పోలవరంలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తెస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలూ అభద్రతా భావానికి లోనయ్యారని, అందువల్లే ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని అన్నారు.

More Telugu News