Marriage: వధూవరుల ప్లెక్సీ చిరగడంతో... అశుభంగా భావించి పెళ్లి వద్దన్న వధువు!

  • తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘటన
  • ఇంటి ముందు ఏర్పాటు చేసిన ప్లెక్సీని చింపేసిన యువకులు
  • అదే సమయంలో వధువు బంధువు కన్నుమూత

తన పెళ్లికి ఏర్పాటు చేసిన ప్లెక్సీ చిరిగిపోయింది. ఇదే సమయంలో బంధువుల ఇంట ఒకరు మరణించారు. దీన్నే అశుభంగా భావించి పెళ్లిని రద్దు చేసుకుందో యువతి. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా వేప్పూర్‌ సమీపంలో జరిగింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కూడా.

వారు వెల్లడించిన వివరాల ప్రకారం, చేపాక్కం గ్రామానికి చెందిన యువకుడు పెరియస్వామికి పెద్దలు వివాహాన్ని నిశ్చయించారు. వివాహం మరికొన్ని గంటల్లో జరగాల్సివుండగా, అతని స్నేహితులు ఓ పెద్ద బ్యానర్ ను ఏర్పాటు చేశారు. అదే గ్రామానికి చెందిన చిన్నదురై అనే వ్యక్తి కుమారులు మణికంఠన్‌, శివలు దాన్ని చింపారు. దీంతో వారి మధ్య గొడవ కూడా జరిగింది.

ఈ విషయం వధువు ఇంట్లో తెలిసిన కాసేపటికే, వధువు బంధువు ఒకరు మరణించారు. దీనిని అశుభంగా భావించిన వధువు వివాహాన్ని వద్దనగా, ఆమెను ఇంటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. దీంతో పెరియస్వామి తన ప్లెక్సీని చింపివేసిన వారిపై కేసు పెట్టాడు. మణికంఠన్, శివను అరెస్ట్ చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు.

More Telugu News