Sadhvi Pragya: సాధ్వి ప్రమాణ స్వీకారంలో గందరగోళం.. విపక్ష సభ్యుల ఆందోళన.. దిగొచ్చిన ప్రజ్ఞాసింగ్

  • తన పేరు చివరన  గురువు పేరును చేర్చిన సాధ్వి
  • విపక్ష సభ్యుల అభ్యంతరం
  • ప్రత్యయాలు వద్దన్న ప్రొటెం స్పీకర్

బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకార సమయంలో లోక్‌సభలో గందరగోళం చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారం సందర్భంగా తన పేరును ‘సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ స్వామి పూర్ణ చేతనానంద్ అవధేషానంద్ గిరి’గా పేర్కొన్నారు. దీంతో విపక్ష సభ్యులు అభ్యంతరం తెలపడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పేరు చివర ప్రత్యయాలు ఏంటంటూ విపక్ష సభ్యులు ప్రశ్నించారు. మరోవైపు సాధ్వికి మద్దతుగా అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తుండడంతో సభలో వాతావరణం వేడెక్కింది.

స్పందించిన ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఉన్న పేరుతోనే ప్రమాణ స్వీకారం చేయాలని సూచించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను అడిగి సాధ్వి గెలుపు సందర్భంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని అడిగి తెప్పించుకున్నారు. దీంతో దిగివచ్చిన సాధ్వి తన పేరుతో మరోమారు ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తిగా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన సాధ్వి ‘భారత్ మాతా కీ జై’ అని ముగించారు.

More Telugu News