V.Hanumantha rao: పంజగుట్టలో వీహెచ్, హర్షకుమార్ అరెస్ట్.. ఉద్రిక్తత

  • అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నం
  • అడ్డుకున్న పోలీసులు
  • విగ్రహం, దానిని తీసుకొచ్చిన లారీ స్వాధీనం

హైదరాబాద్‌లోని పంజగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు వీహెచ్, హర్షకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కొందరు ప్రయత్నించగా ఇటీవల పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు, దానిని చెత్త తరలించే వాహనంలో పడేయడం అప్పట్లో వివాదాస్పదమైంది.

ఈ ఉదయం ఓ లారీలో విగ్రహాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్, వివిధ సంఘాల నేతలు చౌరస్తాలో దానిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హనుమంతరావు, హర్షకుమార్ సహా అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ సమితి అధ్యక్షుడు గుడిమల్ల వినోద్‌కుమార్‌ను అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంబేద్కర్ విగ్రహాన్ని, దానిని తీసుకొచ్చిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నేతల అరెస్ట్‌తో పంజగుట్టలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.  

More Telugu News