Bihar: మెదడువాపు వ్యాధిపై సీరియస్ గా సమీక్ష.. మధ్యలో భారత్ స్కోరు ఎంతన్న బీహార్ మంత్రి!

  • మెదడువాపు వ్యాధితో వందమందికిపైగా చిన్నారుల మృతి
  • సమీక్ష సమావేశంలో స్కోరు అడిగి మంత్రి అభాసుపాలు
  • వెల్లువెత్తుతున్న విమర్శలు

బీహార్‌లో చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. మెదడువాపు వ్యాధి (అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్-ఏఈఎస్)తో మరణిస్తున్న చిన్నారుల సంఖ్య వంద దాటింది. చాలామంది పిల్లలు ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల మరణాల కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై ఆరోగ్య శాఖా మంత్రి మంగళ్ పాండే ఆదివారం వైద్యులతో సమావేశమయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, అశ్విన్ కుమార్ చౌబే తదితరులు కూడా హాజరయ్యారు.

అయితే, అదే సమయంలో ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతుండడంతో ఆయన దృష్టి చిన్నారుల మరణాలపై కాకుండా మ్యాచ్‌పైనే ఉంది. సీరియస్‌గా సమీక్ష జరుగుతుంటే మధ్యలో ‘‘స్కోరెంత? ఎన్నివికెట్లు పడ్డాయి ?’’ అని ప్రశ్నించి కెమెరాకు దొరికారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారుల ప్రాణాల కంటే మంత్రికి మ్యాచ్‌పైనే శ్రద్ధ ఎక్కువగా ఉందంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

More Telugu News