ap assembly: తనిఖీలు చేయకపోవడానికి చంద్రబాబు చట్టానికి అతీతులా?: కాకాణి గోవర్థన్‌రెడ్డి

  • ఆయన దైవాంశ సంభూతులు కారు
  • అబ్దుల్‌ కలాం వంటి వారినే తనిఖీ చేశారు
  • భద్రతా పరమైన అంశాల్లో అవన్నీ భాగమే

విమానాశ్రయాల్లో భద్రతాపరమైన అంశంగా తనిఖీలు సర్వసాధారణమని, చట్టానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అతీతులు కారని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గన్నవరం ఎయిర్‌ పోర్టులో చంద్రబాబును తనిఖీ చేయడంతో ఏదో అపచారంగా టీడీపీ నాయకులు చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.

'మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం లాంటి వారినే ఎయిర్‌ పోర్టులో తనిఖీ చేశారని, అటువంటిది బాబుగారు ఏమైనా దైవాంశ సంభూతులా?’ అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం తాను ప్రతిపక్షంలో ఉన్నానన్న విషయాన్ని చంద్రబాబు గుర్తిస్తే బాగుంటుందన్నారు. అలాగే, వివాహేతర సంబంధాలు, ఇతరత్రా కారణాలతో హత్యలు జరిగితే వాటిని వైసీపీ దాడులుగా ముద్ర వేయడం టీడీపీ నాయకులకు తగదన్నారు. రైతుల గురించి, ప్రజా సంక్షేమం గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదని, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీ  ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు.

More Telugu News