Tamilnadu: తొలిరాత్రిని అడ్డుకున్నాడని కన్న తండ్రిని కడతేర్చిన కుమారుడు!

  • తమిళనాడులో ఘటన
  • శోభనం గదికి వెళ్లే సమయంలో లెక్కలు కోరిన తండ్రి
  • ఆగ్రహంతో తలపై కొట్టిన కుమారుడు

పెళ్లి జరిగిన తొలిరోజే, తనను పడకగదిలోకి వెళ్లనీయకుండా, పెళ్లికి వచ్చిన చదివింపుల వివరాలు చెప్పాలని డిమాండ్ చేసిన తండ్రిని, తీవ్ర ఆగ్రహంతో కడతేర్చాడో కుమారుడు. ఈ ఘటన తమిళనాడులోని అరియలూరు జిల్లా జయంకొండం సమీపంలోని ఆదిచ్చనల్లూరు గ్రామంలో జరిగింది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఈ ప్రాంతానికి చెందిన షణ్ముగం (48) కుమారుడు ఇళమది (23)కి రెండు రోజుల క్రితం వివాహం జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో బంధువులంతా వెళ్లిపోగా, పెళ్లి ఖర్చు లెక్కలు చెప్పాలని, చదివింపుల డబ్బులు తేవాలని షణ్ముగం కొడుకుని కోరాడు.

అప్పటికే తన భార్య శోభనపు గదికి వెళ్లగా, తానూ వెళ్లాలన్న ఆత్రుతలో ఉన్న ఇళమది, అన్ని విషయాలూ రేపు చూసుకుందామన్నాడు. దీనికి షణ్ముగం అంగీకరించలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. అందుబాటులో ఉన్న దుడ్డుకర్రతో కొడుకుపై షణ్ముగం దాడికి ప్రయత్నించడంతో, దాన్నే లాక్కున్న ఇళమది, తండ్రి తలపై బలంగా మోదాడు. దీంతో అతను స్పృహతప్పి పడిపోగా, బంధుమిత్రులు ఆసుపత్రికి తరలించారు.ఈలోగానే అతను మరణించగా, విషయం తెలుసుకున్న పోలీసులు, ఇళమదిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

More Telugu News