ICC World Cup: అదిగో గ్రీన్ సిగ్నల్.. దూసుకెళ్లండి: పాకిస్థాన్ జట్టును ట్రోల్ చేసిన ముంబై పోలీసులు

  • గ్రీన్ ట్రాఫిక్ సిగ్నల్‌ ఫొటోతో పాక్ జట్టును ట్రోల్ చేసిన పోలీసులు
  • నెటిజన్ల ప్రశంసల వర్షం
  • అనుకున్నట్టే దూసుకెళ్లిన ఇండియా

‘గ్రీన్’ సిగ్నల్ కనిపిస్తోంది.. దూసుకెళ్లండి’.. అంటూ ముంబై పోలీసులు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం మాంచెస్టర్ వేదికగా భారత్-పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు మద్దతుగా పాకిస్థాన్‌ను ట్రోల్ చేస్తూ ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. పాక్ జట్టు జెర్సీ రంగు అయిన గ్రీన్ ట్రాఫిక్ సిగ్నల్‌ను పోస్టు చేసిన పోలీసులు.. ‘భారత్‌కు గ్రీన్ కనిపిస్తోంది. మీరెప్పుడూ చేసినట్టుగానే యాక్సిలరేటర్‌ను నొక్కి పట్టండి. హద్దుల్లేకుండా దూసుకెళ్లండి’’ అంటూ ముంబై పోలీసులు ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. పాకిస్థాన్‌ను భలే ట్రోల్ చేశారంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. గ్రీన్ లైట్‌ను ఉపయోగించి కూడా పాకిస్థాన్‌ను ట్రోల్ చేయొచ్చని నిరూపించారంటూ కామెంట్ల వర్షం కురిపించారు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించి ప్రపంచకప్‌లో పాక్‌పై ఉన్న రికార్డును పదిలపరుచుకుంది. ప్రపంచకప్‌లో దాయాదిపై భారత్‌కు ఇది వరుసగా ఏడో విజయం.

More Telugu News