Vishal: వరలక్ష్మి శాపనార్థాలకు హుందాగా బదులిచ్చిన హీరో విశాల్

  • వరలక్ష్మి మాటలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు
  • ఆమెకు మాట్లాడే హక్కుందన్న విశాల్
  • గతంలో స్నేహితులుగా కొనసాగిన విశాల్, వరలక్ష్మి

తమిళ చిత్రపరిశ్రమలో హీరో విశాల్, సీనియర్ నటుడు శరత్ కుమార్ మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి. ఈసారి నడిగర్ సంఘం ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆ భేదాభిప్రాయాలు బట్టబయలయ్యాయి. శరత్ కుమార్ పై విశాల్ ఆరోపణలు చేయగా, శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. స్నేహాన్ని సైతం పక్కనబెట్టి విశాల్ ను ఏకిపారేసింది. మా నాన్నపై నిరాధార ఆరోపణలతో ఇంత నీచానికి దిగజారతావా, నా ఓటును కోల్పోయావు అంటూ మండిపడింది. దీనిపై విశాల్ మాత్రం హుందాగా స్పందించాడు.

"వరలక్ష్మి మాటలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలుగా భావిస్తాను. ఏదైనా అంశంపై ఆమెకు మాట్లాడే హక్కు ఉంటుంది, ఎవరినైనా విమర్శించుకోవచ్చు" అంటూ బదులిచ్చారు. ఒకప్పుడు విశాల్, వరలక్ష్మిల స్నేహబంధం ఎన్నో ఊహాగానాలకు ఊతమిచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని కూడా వార్తలు వచ్చాయి. కానీ, విశాల్ హైదరాబాద్ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని పుకార్లకు అడ్డుకట్ట వేశాడు.

More Telugu News