Andhra Pradesh: ఆ పని చేస్తే వైఎస్ ఆత్మ క్షోభిస్తుంది.. జగన్ కు లేఖ రాసిన మల్లు భట్టి విక్రమార్క!

  • కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లవద్దు
  • దీంట్లో భారీ అవినీతి చోటుచేసుకుంది
  • బహిరంగ లేఖ రాసిన సీఎల్పీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఈరోజు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 21న జరగనున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావొద్దని ఆయన జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ జగన్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ క్షోభిస్తుందని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా ప్రాజెక్టు ఆకృతి మార్పుల్లో అవకతవకలపై పరోక్షంగా బాధ్యులు అవుతారని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు, రివర్స్ టెండరింగ్ విషయంలో వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని భట్టి తెలిపారు.

తమ డిమాండ్లకు జగన్ మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

More Telugu News