Uttar Pradesh: చదువుకుంటానన్న బాలిక.. కత్తితో విచక్షణ రహితంగా పొడిచిన తండ్రి

  • పెళ్లి వద్దని మొరాయించిన బాలిక
  • కుమారుడితో కలిసి కుమార్తెపై కత్తితో దాడి
  • ఆపై కాలువలోకి తోసేసిన తండ్రి

తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, చదువుకుంటానని చెప్పిన ఓ బాలికపై ఆయన తండ్రి విచక్షణ రహితంగా దాడి చేశాడు. కత్తితో పలుమార్లు పొడిచాడు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగిందీ ఘటన. తనను కాలువ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి తనతో వాగ్వివాదానికి దిగాడని, తన సోదరుడు కూడా అక్కడే ఉన్నాడని 15 ఏళ్ల బాధిత బాలిక తెలిపింది. సోదరుడు తన మెడను ఓ గుడ్డతో గట్టిగా బిగించి పట్టుకోగా , తండ్రి వెనక నుంచి పలుమార్లు పొడిచాడని పేర్కొంది. పొడొవద్దని వేడుకున్నా తండ్రి వినలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని, చదువుకుంటానని చెప్పడంతోనే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపింది.

కుమార్తెను కత్తితో పలుమార్లు పొడిచిన తండ్రి.. కుమారుడితో కలిసి ఆమెను పక్కనే ఉన్న కాలువలోకి తోసేశాడు. అయితే, బాలికకు ఈత తెలిసి ఉండడంతో రక్తమోడుతూనే ఈదుతూ అక్కడి నుంచి తప్పించుకుంది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

More Telugu News