Chandrababu: చంద్రబాబు హయాంలో ఎన్నో హత్యలు జరిగాయి: జోగి రమేష్

  • హత్యా రాజకీయాలకు చంద్రబాబుకు పేటెంట్ ఉంది
  • ఐదేళ్ల పాలనలో చంద్రబాబు సాధించింది శూన్యం
  • 23 సీట్లకు పరిమితమైనా ఆయనలో పశ్చాత్తాపం లేదు

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో హత్యలు జరిగాయని... హత్యా రాజకీయాలకు చంద్రబాబుకు పేటెంట్ కూడా ఉందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. టీడీపీ హయాంలో వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ప్రజలను టీడీపీ నేతలు దోచుకోవడం తప్ప... చంద్రబాబు సాధించింది శూన్యమని అన్నారు. పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని... వైసీపీలోకి ఎవరైనా రావాలనుకుంటే, రాజీనామా చేసి రావాలని చెప్పారు.

గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును తనిఖీ చేయడంపై టీడీపీ నేతలు అనవసరంగా గగ్గోలు పెడుతున్నారంటూ జోగి రమేష్ ఎద్దేవా చేశారు. జడ్ ప్లస్ కేటగిరీ అనేది ఏవియేషన్ లో వర్తించదని... ఆ విషయాన్ని ఏపీడీ అధికారులే స్వయంగా చెప్పారని అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే అధికారులు తనిఖీలు చేశారని చెప్పారు. చంద్రబాబుకు చింత చచ్చినా పులుపు చావలేదని... ఎమ్మెల్యేల సంఖ్య 23కు పరిమితమైనా ఆయనలో పశ్చాత్తాపం లేదని అన్నారు.

More Telugu News