Vijayanagaram District: కుప్పకూలిన సభా వేదిక...ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి తప్పిన ప్రమాదం

  • భోగాపురంలో అభినందన సభకు హాజరైన మంత్రి
  • వేదికపై జనం పెరగడంతో ఘటన
  • అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

విజయనగరం జిల్లా భోగాపురం మండల కేంద్రంలో అభినందన సభా వేదిక కుప్పకూలిన ఘటనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణికి పెద్ద ప్రమాదం తప్పింది. సార్వత్రిక ఎన్నికల్లో కురుపాం ఎస్టీ నియోజకవర్గం నుంచి రెండోసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందడమేకాక, రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకుని ఉప ముఖ్యమంత్రి హోదా సాధించిన పుష్పశ్రీవాణికి భోగాపురం నేతలు రాజాపులోవ జంక్షన్ లో ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేశారు.

ఈ సభకు హాజరైన మంత్రి వేదికపైకి వచ్చారు. అదే సమయంలో ఒక్కసారిగా పలువురు పార్టీ నాయకులు, అభిమానులు కూడా వేదికపైకి రావడంతో అది కుప్పకూలింది. భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో ఆమెతోపాటు వేదికపై ఉన్న వారికి కూడా ప్రమాదం తప్పింది. అంతా క్షేమంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News