Crime News: అనుమానపు మొగుడు... గర్భిణి అయిన భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పు

  • తీవ్రంగా గాయపడిన బాధితురాలు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • మృతురాలు ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయిని

నిండు గర్భిణి అయిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయినిపై భర్తే పెట్రోల్‌పోసి నిప్పంటించి హత్య చేశాడు. భార్యపై అనుమానంతో అమానుషంగా వ్యవహరించాడు.  కృష్ణా జిల్లా విజయవాడ కృష్ణలంకలో ఈరోజు తెల్లవారు జామున జరిగిన ఈ ఘోరానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

 బాధితురాలు శైలజ కృష్ణలంకలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె ప్రస్తుతం గర్భవతి. శైలజ భర్త నంబియార్‌కు ఆమె ప్రవర్తనపై అనుమానం ఉంది. ఈ అనుమానం పెనుభూతంగా మారడంతో భార్య గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా ఆమెపై హత్యా యత్నం చేశాడు. తెల్లవారు జామున ఆమె నిద్రలో ఉండగా పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. నంబియార్‌ గుడివాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తుండడం గమనార్హం. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News