Crime News: మెసేజ్‌ ఫార్వార్డ్‌ చేస్తే అకౌంట్ నుంచి రూ.లక్ష మాయం: సైబర్‌ నేరగాడి నయా మోసం

  • ఎయిర్‌ టెల్‌ ప్రతినిధిని అంటూ ఫోన్‌
  • రూ.10లు మీ అకౌంట్‌ నుంచి బదిలీ చేయాలని విజ్ఞప్తి
  • మెసేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయగానే అకౌంట్‌ నుంచి నగదు బదిలీ

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆన్‌లైన్‌ లావాదేవీల నిర్వహణకు ఓ వైపు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటుంటే సైబర్‌ నేరగాళ్లు కూడా అందుకు అనుగుణంగా రూట్‌ మార్చి కొత్త పోకడల్లో మోసాలకు పాల్పడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఓ మెసేజ్‌ని ఫార్వార్డ్‌ చేసినందుకు  హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తన ఖాతా నుంచి  లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే... నగరంలోని రామంతాపూర్‌కు చెందిన ఓ వ్యాపారి (48)కి ఈనెల 4న ఫోన్‌ కాల్‌ వచ్చింది. అవతలి వ్యక్తి తన పేరు కిషోర్‌ అని, తాను ఎయిర్‌టెల్‌ ప్రతినిధినని తనను తాను పరిచయం చేసుకున్నాడు. త్వరలోనే మీ సిమ్‌ బ్లాక్‌ అవుతుందని, అలాకాకుండా ఉండేందుకు మీ యూపీఐ ఖాతా నుంచి రూ.10 చెల్లించాలని కోరాడు.

సదరు వ్యాపారి తనకు యూపీఐ ఖాతా లేదని చెప్పగా తాను ఓ మెసేజ్‌ పంపిస్తానని, దాన్ని తానిచ్చిన  సెల్‌ ఫోన్‌ నంబర్‌కి ఫార్వర్డ్‌ చేస్తే చాలని నమ్మబలికాడు. అది నిజమేనేమో అనుకుని సదరు వ్యాపారి గుర్తు తెలియని వ్యక్తి పంపిన మెసేజ్‌ని ఫార్వార్డ్‌ చేశాడు. అంతే...కాసేపటికే అతని ఖాతా నుంచి 99,910 రూపాయలు వేరే అకౌంట్‌కు బదిలీ అయిపోయాయి. దీంతో కంగుతిన్న సదరు వ్యాపారి తాను మోసపోయానని గుర్తించి వెంటనే రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశయ్రించాడు.

More Telugu News