UAE: ఆన్ లైన్ మోసగత్తెకు అరదండాలు... భర్త వదిలేశాడంటూ సోషల్ మీడియాలో భిక్షాటన!

  • నిజమని నమ్మి సాయం చేసిన నెటిజన్లు
  • 17 రోజుల్లో 50 వేల డాలర్ల సంపాదన
  • ఎట్టకేలకు ఆటకట్టు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భర్త వదిలేశాడు, పిల్లల ఆలనాపాలనా చూసుకోవాలి, డబ్బు సాయం చేయండి అంటూ ఆన్ లైన్ లో భిక్షాటన చేస్తున్న యువతి ఓ మోసగత్తె అని కాస్త ఆలస్యంగా వెల్లడైంది. అయితే అప్పటికే ఆమె మాయమాటలకు ఎంతోమంది మోసపోయారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఇలా అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అకౌంట్ తెరిచి తన వంచక పర్వాన్ని కొనసాగించింది. ఆ విధంగా 17 రోజుల్లో 50,000 డాలర్లు రాబట్టిందా కిలాడీ.

ఇప్పుడామె కటకటాల వెనక్కి చేరింది. ఆమె పోస్టుల్లో ఉన్న చిన్న పిల్లలను గుర్తుపట్టిన బంధువులు భర్తకు విషయం చెప్పడంతో ఆ మాయలేడి గుట్టురట్టయింది. అతగాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్ట్ చేశారు. భర్త వదిలేసిన విషయం వాస్తవమే అయినా, పిల్లలను ఆమె భర్తే చూసుకుంటున్నాడన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో ఆ మహిళ ఆన్ లైన్ లో అందరినీ మోసం చేస్తోందని గుర్తించారు.

More Telugu News