Andhra Pradesh]: టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఓటమిపై భావోద్వేగంతో స్పందించిన గల్లా జయదేవ్!

  • సంక్షోభంలోనే ప్రజలకు బాబు గుర్తుకొస్తారు
  • అది ముగిశాక అంతా వేరే పార్టీవైపు చూస్తున్నారు
  • ఏపీకి చంద్రబాబు అవసరం ఇంకా ఉంది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలకు పరిమితం కావడంపై గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు సంక్షోభ సమయంలోనే చంద్రబాబు గుర్తుకు వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అన్నీ సాఫీగా ఉన్న సమయంలో ప్రజలు వేరే పార్టీలవైపు చూస్తున్నారని విమర్శించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ లో ఈరోజు జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో గల్లా జయదేవ్ మాట్లాడారు.

ఏపీకి ఇంకా చంద్రబాబు అవసరం ఉందని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. ఆ విషయం ఏపీ ప్రజలకు త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. లోక్ సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినవారిలో కేశినేని నాని ప్రథముడని గల్లా జయదేవ్ చెప్పారు. పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నాని హర్ట్ అయినట్లు తనకు అనిపిస్తోందని చెప్పారు. కేశినేని నాని టీడీపీని వీడరనీ, పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.

More Telugu News