sunder pichai: ప్రపంచకప్ విజేత ఈ దేశమే: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జోస్యం

  • ఫైనల్స్ లో ఇండియాతో ఇంగ్లండ్ తలపడుతుంది
  • భారత్ జయకేతనం ఎగురవేస్తుంది
  • తాను క్రికెట్ కు పెద్ద అభిమానిని

ఇంగ్లండ్ లో జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ లో ఏ దేశం గెలుస్తుందో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జోస్యం చెప్పారు. ఫైనల్స్ లో ఇండియాతో ఇంగ్లండ్ తలపడుతుందని ఆయన చెప్పారు. చివరకు విశ్వ విజేతగా నిలిచేది మెన్ ఇన్ బ్లూ (ఇండియా) అని అంచనా వేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు కూడా బలమైన జట్లు అని చెప్పారు. తాను క్రికెట్ కు పెద్ద అభిమానినని సుందర్ పిచాయ్ తెలిపారు.

అమెరికాకు వచ్చిన తర్వాత బేస్ బాల్ ఆడాలనిపించిందని పిచాయ్ చెప్పారు. తాను తొలిసారి బేస్ బాల్ మ్యాచ్ ఆడినప్పుడు... తాను కొట్టిన బంతి వెనక వైపుగా వెళ్లిందని... క్రికెట్లో అయితే అది చాలా మంచి షాట్ అని చమత్కరించారు. తన వరకైతే ఆ షాట్ ఎంతో నచ్చిందని... కానీ, తన షాట్ ను ఎవరూ ప్రశంసించలేదని చెప్పారు. క్రికెట్లో వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడు బ్యాట్ చేతిలో పట్టుకొని పరుగెడతామని... బేస్ బాల్ లో కూడా అదే విధంగా బ్యాట్ పట్టుకుని పరుగెత్తానని... బేస్ బాల్ కొంచెం కష్టమనిపించిందని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా తాను మారుతానని... కానీ, ఇప్పటికీ తనకు క్రికెటే ఇష్టమని చెప్పారు.

More Telugu News