tammineni: అభినందనలు తెలిపేందుకు వెళ్తూ అనంతలోకాలకు...రోడ్డు ప్రమాదంలో తమ్మినేని అనుచరులు ఇద్దరి మృతి

  • ఈరోజు స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్న సీతారాం
  • ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు శ్రీకాకుళం నుంచి ప్రయాణం
  • తూర్పుగోదావరి జిల్లాలో లారీని ఢీకొట్టిన వీరి వాహనం

తమ అభిమాన నేత ఉన్నత పదవిని స్వీకరిస్తున్నారన్న ఆనందంలో ఆయనకు అభినందనలు చెప్పేందుకు బయలుదేరిన వారికి అదే ఆఖరి ప్రయాణం అయింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో అనంతలోకాలకు సాగిపోయారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ప్రమాణం చేయనున్న తమ్మినేని సీతారాం అనుచరుల విషాదాంతం ఇది.

పోలీసుల కథనం మేరకు... స్పీకర్‌గా శ్రీకాకుళం జల్లా ఆముదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన ఈరోజు అసెంబ్లీలో స్పీకర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఆయనకు అభినందనలు చెప్పేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు బస్సులు, ఆరు కార్లలో వైసీపీ నేతలు పలువురు అమరావతికి బుధవారం అర్ధరాత్రి బయలుదేరారు.

ఈ వాహనాల్లో పొందూరు మండలం ధర్మాపురానికి చెందిన పప్పల నారాయణమూర్తి (69), గోరింట గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ బి.ఎల్‌.నాయుడు (55)లు ప్రయాణిస్తున్న స్కార్పియో తూర్పుగోదావరి జిల్లా తుని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణమూర్తి, బి.ఎల్‌.నాయుడు వాహనంలోనే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను తుని ఆసుపత్రికి తరలించారు.

More Telugu News