Chittoor District: గర్ల్ ఫ్రెండ్ తో దిగిన ఫొటోలు స్నేహితులకు షేర్... కోరిక తీర్చాలని అందరి వేధింపులు!

  • చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో ఘటన
  • టెన్త్ విద్యార్థితో తొమ్మిది చదువుతున్న బాలిక సాన్నిహిత్యం
  • ఆ ఫొటోలు చూపి మిగతా విద్యార్థుల బలవంతం

చిత్తూరు జిల్లా చంద్రగిరి పరిధిలోని పనపాకం మండలంలో లైంగిక వేధింపుల కేసు పోలీసుల ముందుకు వచ్చి కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, తనను ఐదుగురు తెలిసిన స్నేహితులే వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మైనర్ బాలిక పోలీసులను ఆశ్రయించింది. తన తల్లిదండ్రులతో కలిసి ఆ బాలిక స్టేషన్ కు రాగా, కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు విచారించి, విస్తుపోయే నిజాలను వెలికితీశారు.

 తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక, అదే స్కూల్ లో పదో తరగతి చదువుతున్న బాలుడితో చేసిన స్నేహం, హద్దులు దాటిందని తేల్చారు. ఆ బాలికతో తాను సన్నిహితంగా ఉన్న ఫొటోలను, గొప్పలు చెప్పుకునేందుకు తన మిత్రులకు సదరు బాలుడు షేర్ చేయగా, వారంతా అదే బాలిక వద్దకు వచ్చి, తమ కోరిక కూడా తీర్చాలని పట్టుబట్టారు. లేకుంటే, తమ వద్ద ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని బెదిరించారు.

దీంతో ఏం చేయాలో పాలుపోని సదరు బాలిక, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఐదుగురు మైనర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని వెల్లడించిన పోలీసులు, వీరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, న్యాయ సలహా తీసుకుని కేసు విషయంలో ముందడుగు వేస్తామని వెల్లడించారు.

More Telugu News