jagan: ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా: జగన్

  • 'పెద్దల సభలో తెలుగు పెద్ద' పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్
  • సినారె పార్లమెంటు ప్రసంగాలపై పుస్తకం
  • పుస్తకాన్ని రచించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) పార్లమెంటు ప్రసంగాలపై రూపొందించిన 'పెద్దల సభలో తెలుగు పెద్ద' పుస్తకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురామ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సినారే కవితలు, మాటల గురించి తను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. 1997లో రాజ్యసభకు సినారె నామినేట్ అయ్యారు. ఆరేళ్ల పాటు ఆయన ప్రశ్నలు, చర్చలు, ప్రస్తావనలు, ప్రసంగాలు అందరి మన్ననలను అందుకున్నాయి.

More Telugu News