Jagan: మంత్రివర్గంలోకి రోజాను కూడా తీసుకుని ఉంటే బాగుండేది: విజయశాంతి

  • కేసీఆర్ తన మంత్రివర్గంలో మహిళను లేకుండా చేశారు
  • మరో ఐదేళ్లు ఇదే ప్లాన్ తో ఉన్నారు
  • రోజా విషయంలో సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలి
  • జగన్ కు విజయశాంతి సలహా

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన మంత్రివర్గంలో సినీ నటి రోజాను కూడ తీసుకుని ఉంటే బాగుండేదని, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా ట్వీట్లు పెట్టారు. కేసీఆర్ తన మంత్రివర్గంలో ఐదేళ్ల పాటు మహిళను లేకుండా చేశారని, మరో ఐదేళ్లు ఇదే ప్లాన్ తో ఉన్నారని మండిపడ్డారు.

"సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజాకు కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని, వారికి కూడా తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని  నేను చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో నైనా జగన్ గారు రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు.

ఆ తరువాత కెసిఆర్ గారికి మాత్రం ఈ విషయంపై పెద్దగా పట్టింపు లేకపోవడం  మహిళలపై  ఆయనకున్న  ఉదాసీనతకు నిదర్శనమని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో మహిళా మంత్రులకు స్థానం ఇవ్వకుండా కేబినెట్లో కొనసాగించిన పరిస్థితి మళ్లీ పునరావృతం అవుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్పుపై కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయాలి అనుకుంటున్నానని తెలిపారు.

జగన్ తన మంత్రివర్గంలో మహిళలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖను కేటాయించడం మీద జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, కనీసం దీనిని చూసిన తర్వాత అయినా కేసీఆర్ మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా అని ప్రశ్నించారు. 

More Telugu News