Jana Sena: పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కూడా నాకు దొరికేది కాదు: రావెల కిశోర్ బాబు

  • కనీసం ఫోన్లో కూడా పవన్ మాట్లాడే వారు కాదు
  • పవన్ నా సలహాలు, సూచనలు ఎప్పుడూ తీసుకోలేదు
  • రాజకీయవ్యూహాలపై చర్చకు నాకు అవకాశమివ్వలేదు

జనసేన కీలక నేతల్లో తాను కూడా ఒకడిని అన్న వార్త అవాస్తవమని, పవన్ కల్యాణ్ ఎప్పుడూ తన సలహాలు, సూచనలు తీసుకోలేదని రావెల కిశోర్ బాబు అన్నారు. తిరుపతిలో నిన్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీలో ఆయన చేరారు. ఈరోజు గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ, అసలు, పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కూడా తనకు దొరికేది కాదని, ఫోన్లో కూడా మాట్లాడే వారు కాదని చెప్పారు.

 పైకి సన్నిహితంగా కనిపించినప్పటికీ, రాజకీయపరమైన వ్యూహాలపై చర్చించేందుకు పవన్ కల్యాణ్ తనకు ఎప్పుడూ అవకాశమివ్వలేదని విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయన్న వాదనపై ఆయన మాట్లాడుతూ, గ్రామీణ స్థాయి వరకూ ప్రచారం జరిగిందని, ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మారని అన్నారు. జనసేనకు ఓటేస్తే టీడీపీకి వేసినట్టవుతుందని, మళ్లీ అవినీతి టీడీపీకే పట్టం కట్టాల్సి వస్తుందని భావించిన ప్రజలు చంద్రబాబును, టీడీపీని పక్కనబెట్టి, వైసీపీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారని విశ్లేషించారు.

More Telugu News