Tamilnadu: తమిళ సినీ రచయిత, హాస్య నటుడు క్రేజీ మోహన్ కన్నుమూత

  • చెన్నైలో గుండెపోటుతో మృతి చెందిన క్రేజీ మోహన్  
  • కావేరి ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణాలు
  • క్రేజీ మోహన్ మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

తమిళ సినీ రచయిత, హాస్యనటుడు క్రేజీ మోహన్ (67) గుండెపోటుతో ఈరోజు కన్నుమూశారు. చెన్నైలో గుండెపోటుకు గురైన ఆయన్ని వైద్య చికిత్స కోసం కావేరి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. క్రేజీ మోహన్ మృతిపై తమిళ చిత్ర రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇంజనీరింగ్ చదివే రోజుల్లో క్రేజీ మోహన్ నాటక రచన చేస్తుండే వారు. తన సోదరుడు మధు బాలాజీ నిర్వహించే నాటక కంపెనీకి క్రేజీ మోహన్ స్క్రిప్ట్ రైటర్ గా పని చేశారు.  ‘క్రేజీ తీవ్స్ ఇన్ పాలవాక్కం’ అనే నాటకంలో ఆయన నటించిన తర్వాత మోహన్ పేరు క్రేజీ మోహన్ గా పాప్యులర్ అయింది. క్రేజీ మోహన్ సినీ కెరీర్ గురించి చెప్పాలంటే.. ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘పొయ్ కల్ కుదరై’ సినిమాతో నటుడిగా ఆయన కెరీర్ మొదలైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆయన నటించారు. విచిత్ర సహోదరులు, మైఖేల్ మదన కామరాజ్, సతీ లీలావతి, భామనే సత్య భామనే, తెనాలి, పంచతంత్రం, కాదల కాదల, వసూల్ రాజా ఎంబీబీఎస్ మొదలైన చిత్రాల్లో ఆయన నటించారు. కమలహాసన్ కు క్రేజీ మోహన్ అంటే ఎంతో ఇష్టం. తన సినిమాల స్క్రీన్ ప్లే విషయంలో ఆయన సహకారం తప్పకుండా తీసుకునేవారు.

More Telugu News