Jayaram: ఎన్నారై జయరాం హత్యకేసు... నటుడు సూర్యప్రసాద్ సహా 12 మంది నిందితుల పేర్లతో చార్జ్ షీట్!

  • చార్జ్ షీట్ ను దాఖలు చేసిన పోలీసులు
  • 23 పేజీల చార్జ్ షీట్ లో 73 మంది సాక్షుల పేర్లు
  • 11వ సాక్షిగా జయరాం మేనకోడలు శిఖా

ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు చార్జ్ షీట్ ను దాఖలు చేశారు. హనీట్రాప్ ను పన్ని, వీణ అనే యువతి పిలిచినట్టుగా నాటకమాడి, ఆయన్ను రప్పించి, చిత్రహింసలు పెట్టి హత్య చేసిన రాకేశ్ రెడ్డి, ఆపై మృతదేహాన్ని తెలంగాణ సరిహద్దులు దాటించాడని 23 పేజీల చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 12 మంది నిందితులను, 73 సాక్షుల పేర్లను ఇందులో చేర్చారు.

ఈ కేసులో నిందితులుగా రాకేష్‌ రెడ్డి, విశాల్, వాచ్ మెన్ శ్రీనివాస్, రౌడీ షీటర్ నగేశ్, నటుడు, కమెడియన్ సూర్యప్రసాద్, సూర్యప్రసాద్ స్నేహితుడు కిశోర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సుభాష్ రెడ్డి, టీడీపీ నేత బీఎన్ రెడ్డి, వ్యాపారి అంజిరెడ్డి, నల్లకుంట మాజీ ఇనస్పెక్టర్ శ్రీనివాసులు, రాయదుర్గం మాజీ ఇనస్పెక్టర్ రాంబాబు, ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు. రాకేశ్ గర్ల్ ఫ్రెండ్, జయరాం మేనకోడలు శిఖా చౌదరిని 11వ సాక్షిగా పేర్కొన్నారు.

More Telugu News