Love Marriage: తన భార్యను అప్పగించాలంటూ యువకుడి ఆవేదన!

  • ఫిబ్రవరిలో లవ్ మ్యారేజ్
  • తొలుత బాగానే ఉన్న యువతి తల్లిదండ్రులు
  • ఆపై ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు
  • మీడియా ముందు ప్రభాస్ అనే యువకుడి ఆవేదన

తాను ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకోగా, ఆమె కుటుంబసభ్యులు బలవంతంగా తన భార్యను తీసుకెళ్లారని, పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారని విశాఖపట్నం యువకుడు, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న పొన్నాన ప్రభాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.

హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన అతను, తన భార్యతో కలిసున్న ఫొటోలు చూపిస్తూ, తమ దంపతులకు ఎదురైన అనుభవాలను వివరించాడు. కూకట్‌ పల్లిలో బిఎఫ్‌ఏ చదువుతున్న తనకు లోధా అపార్ట్‌ మెంట్‌ లో ఉంటున్న తన్వి పరిచయం కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 15న శ్రీనగర్‌ కాలనీలోని సాయిబాబా గుడిలో ఫ్రెండ్స్ తో పాటు తన్వి సోదరి సమక్షంలో పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. తాను తరచూ తన్వి ఇంటికి వెళ్లేవాడినని, వాళ్ల అమ్మతో కూడా మాట్లాడే వాడినని అన్నాడు.

వారి సూచన మేరకు తాము కూడా లోధా అపార్ట్ మెంట్స్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుండగా, తన్వీని ఆమె కుటుంబీకులు బలవంతంగా తీసుకెళ్లారని, తనను అదే రోజు కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేసి, మూడు గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. పోలీసుల ఎదుటే తన్వి తండ్రి శ్రీనివాసరావు తనపై దాడి చేశాడని, తన ఇంటిని ధ్వంసం చేసి, పెళ్లి జరిగిన ఆధారాలను తీసుకెళ్లారని చెప్పాడు.

తన ఫోన్, ల్యాప్‌ ట్యాప్, బంగారం కూడా ఎత్తుకెళ్లారని, అన్నాడు. పోలీసులు కూడా నిందితులతో చేతులు కలిపారని ఆరోపించాడు. తన భార్యను వెంటనే అప్పగించకుంటే ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో మార్గం లేదన్నాడు. రాష్ట్ర హోమ్ మంత్రి, పోలీస్‌ కమిషనర్‌ వెంటనే జోక్యం చేసుకోవాలని, తనకు న్యాయం చేయాలని అభ్యర్థించాడు.

More Telugu News