Tirumala: వైభవోపేతంగా తిరుమల శ్రీవారి సహస్ర కలశాభిషేకం.. రెండు గంటలపాటు ఏకాంత సేవ

  • ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య గరుడాళ్వార్‌ సన్నిధిలో
  • శ్రీవారి మూలమూర్తికి, భోగశ్రీనివాసుడికి దారంతో అనుసంధానం
  • దీనివల్ల మూలమూర్తికే పూజలన్నీ

శ్రీవారి పంచబేరాల్లో ఒకటైన భోగశ్రీనివాసమూర్తిని పల్లవ రాణి శ్రీవారి ఆలయానికి బహూకరించిన రోజును పురస్కరించుకుని ఏటా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ‘సహస్ర కలశాభిషేకం’ ఈరోజు ఉదయం ఘనంగా నిర్వహించారు. గరుడాళ్వార్‌ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామిని కొలువుదీర్చి ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య అర్చక స్వాములు స్వామికి ఏకాంత సేవ నిర్వహించారు.

శ్రీవారి మూలమూర్తికి ముందు కౌతుకమూర్తి అయిన శ్రీమనవాళపెరుమాళ్‌ను, ఆయనకు అభిముఖంగా శ్రీ విష్వక్సేనుల వారిని ఉంచారు. మధ్యన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని, భోగశ్రీనివాసమూర్తి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. మూలమూర్తిని, భోగశ్రీనివాసమూర్తికి కలుపుతూ దారంకట్టి అనుసంధానం చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణ మధ్య అర్చక స్వాములు అభిషేకం నిర్వహించారు. తర్వాత ఏకాంత సేవ కొనసాగింది. దీనివల్ల భోగశ్రీనివాసమూర్తికి నిర్వహించిన అభిషేక క్రతువులన్నీ మూలమూర్తికి నిర్వహించినట్టవుతుంది.

More Telugu News