Rahul Gandhi: వయనాడ్‌లో రాహుల్ అందుకే గెలిచారు: అసదుద్దీన్ ఒవైసీ

  • వయనాడ్‌లో 40 శాతం ముస్లిం జనాభా ఉంది
  • మనం ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు
  • బీజేపీ ఓడిన ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్‌లో ఎందుకు గెలవగలిగారో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పుకొచ్చారు. అమేథీలో ఓడిపోయిన రాహుల్ కేరళలోని వయనాడ్‌లో గెలిచారని పేర్కొన్న ఒవైసీ.. వయనాడ్‌లో 40 శాతం ముస్లిం జనాభా ఉండడమే అందుకు కారణమన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఓ బహిరంగ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు ఎవరి దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. వయనాడ్‌లో రాహుల్ గెలవడానికి అక్కడ 40 శాతం ఉన్న ముస్లింలు కారణం కాదా? అని ప్రశ్నించారు.

‘‘15 ఆగస్టు 1947లో మన పెద్దలు ఇది నయా ఇండియాగా రూపాంతరం చెందుతుందని భావించారు. ఆజాద్, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ , వారి అభిమానులతో నిండిపోతుందని ఆశించారు. దేశంలో మన స్థానం మనకి ఉంటుందని నేనిప్పటికీ నమ్ముతున్నా. మనకి ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. ఎవరి చెప్పుచేతల్లోనూ ఉండాల్సిన పనిలేదు’’ అని  ఒవైసీ పేర్కొన్నారు.

'మీరు కాంగ్రెస్ పార్టీనో, లేదంటే ఇతర సెక్యులర్ పార్టీనో వీడాల్సిన అవసరం లేదు. అయితే, వారికి బలం లేదని గ్రహించండి. కాంగ్రెస్ గట్టిగా పనిచేయకున్నా పంజాబ్‌లో బీజేపీ ఓడిపోయింది. అక్కడ ఎవరున్నారయ్యా అంటే సిక్కులు. మరి, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు ఓడిందంటే.. కాంగ్రెస్ వల్ల కాదు. ప్రాంతీయ పార్టీల వల్ల. స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడే అమేథీలో ఓడిపోయారు. కానీ వయనాడ్‌లో ఆయన గెలవగలిగారంటే  అక్కడ ముస్లిం జనాభా 40 శాతం ఉండడ వల్ల కాదా?’’ అని అసద్ ప్రశ్నించారు.

More Telugu News