Madhya Pradesh: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసి మృతదేహాన్ని మురుగు కాల్వలో పడేసిన దుండగులు

  • దుకాణానికి వెళ్లిన బాలిక
  • ఎంతకీ తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
  • స్థానిక మురుగు కాల్వలో బాలిక మృతదేహం
  • ఆరుగురు పోలీసుల సస్పెండ్

రెండున్నరేళ్ల పసిపాపపై జరిపిన అమానుష దాడి మరువక ముందే మానవత్వాన్ని మంటగలిపే మరో ఉదంతం వెలుగు చూసింది. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేసి మురుగు కాలువలో పడేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని మురికివాడలో నివాసముంటున్న బాలిక శనివారం సాయంత్రం దుకాణానికని వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో పోలీసులకు చిన్నారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే ఆదివారం ఉదయం స్థానికంగా ఉన్న మురికి కాల్వలో బాలిక మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నివేదికలో అత్యాచారం అనంతరం బాలికను గొంతు నులిమి హత్య చేసినట్టు తేలింది.

అయితే ఫిర్యాదు అనంతరం బాలిక ఇంటికి వచ్చిన పోలీసులు పాప ఎవరితోనో వెళ్లిపోయి ఉంటుందని పేర్కొన్నట్టు స్థానికులు తెలపడంతో ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు పోలీసులపై సస్పెండ్ వేటు పడింది. ఈ ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ హోంమంత్రి బాల బచ్చన్, ఈ ఘటనకు సంబంధించి బాలిక ఇంటి సమీపంలో నివాసముండే విష్ణు అనే కూలిని అనుమానిస్తున్నామని, అతడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామన్నారు. పలువురు స్థానికులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ పాప కుటుంబ సభ్యులను పరామర్శించారు.

More Telugu News