Narendra Modi: మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్న వైఎస్ జగన్!

  • నేటి సాయంత్రం భేటీ
  • రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వినతిపత్రం
  • స్వామివారి దర్శనానికి కిషన్ రెడ్డి కూడా

నేటి సాయంత్రం తిరుమలకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీతో, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అవనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటికీ పెండింగ్‌ లో ఉన్న విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై వీరిద్దరి మధ్యా చర్చ జరుగుతుందని సమాచారం.

కేంద్రం నుంచి రావాల్సిన రూ. 74,169 కోట్లు ఇవ్వాలని జగన్‌ వినతిపత్రాన్ని అందిస్తారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు కింద రావాల్సిన రూ. 18,969 కోట్లు విడుదల చేయాలని జగన్‌ కోరనున్నారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో వీరిద్దరి భేటీ జరుగుతుందని తెలుస్తోంది.

ఇదిలావుండగా,  మోదీతో పాటు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి కూడా శ్రీవారి దర్శనానికి రానున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీఐపీల రాక సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

More Telugu News