Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించిన రెబెల్ స్టార్ కృష్ణం రాజు!

  • ఏపీ సీఎం, నూతన కేబినెట్ కు శుభాకాంక్షలు
  • జగన్ నిర్ణయం సామాజిక విప్లవానికి నాంది
  • బీసీలు, ఎస్సీ,ఎస్టీలకు పెద్దపీట వేశారని వ్యాఖ్య

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో 25 మందితో నేడు మంత్రివర్గం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు స్పందించారు. వేర్వేరు సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ జగన్ ఏర్పాటుచేసిన కేబినెట్ ‘సామాజిక విప్లవానికి నాంది’గా భావిస్తున్నట్లు తెలిపారు. జగన్ కు, నూతన మంత్రివర్గానికి శుభాకాంక్షలు చెప్పారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మంత్రి మండలి ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీ, బలహీన, మైనారిటీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించటం అభినందనీయం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఐదుగురు ఉపముఖ్యమంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు కేటాయించడం మీ ఉన్నత నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. ఎవరూ ఊహించని విధంగా 8 మంది బీసీలకు, ఐదుగురు ఎస్సీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం భవిష్యత్తు రాజకీయాలకు మార్గదర్శకంగా నేను భావిస్తున్నాను.

పరిణతి చెందిన ప్రజానాయకుడిగా మీరు స్పీకర్ పదవిని బీసీలకు, డిప్యూటీ స్పీకర్ పదవిని బ్రాహ్మణులకు కేటాయించడం చాలా మంచి నిర్ణయం’ అని కృష్ణంరాజు ప్రశంసించారు. పిన్నవయసులోనే ప్రజానేతగా ఎదిగిన జగన్.. రాజకీయాల్లో రియల్ హీరోగా నిలిచారని కితాబిచ్చారు. జగన్ నేతృత్వంలోని మంత్రిమండలి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News