Andhra Pradesh: కర్నూలు జిల్లాలో లోయలోకి పల్టీలు కొట్టిన బస్సు.. 15 మందికి తీవ్రగాయాలు!

  • ఏపీలోని శ్రీశైలంలో ఘటన
  • అదుపు తప్పి లోయలోకి జారిపోయిన వాహనం
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు లోయలోకి జారిపోయింది. తమిళనాడు నుంచి శ్రీశైలానికి ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బయలుదేరింది. అయితే శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సు వేగాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలమయ్యాడు. దీంతో అదుపుతప్పిన వాహనం పక్కనే ఉన్న లోయలోకి పల్టీలు కొడుతూ జారిపోయింది.

ఈ దుర్ఘటనలో 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. అటుగా వెళుతున్న వాహనదారులు ఈ ప్రమాదాన్ని గమనించి పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? ట్రావెల్స్ బస్సుకు ఫిట్ నెస్ పర్మిట్ ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News