Madhya Pradesh: ఎన్ని మందులు వాడినా గజ్జి తగ్గలేదంటూ డాక్టర్ భార్యను హత్యచేసిన వ్యక్తి

  • మధ్యప్రదేశ్ లో దారుణం
  • డాక్టర్ పై కోపంతో విచక్షణ మరిచిన రోగి
  • డాక్టర్ భార్య మృతి, కొడుకు పరిస్థితి విషమం

మధ్యప్రదేశ్ లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. రఫీక్ అనే వ్యక్తి కొంతకాలంగా చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. అయితే, ఎన్ని మందులు వాడినా గజ్జి తగ్గలేదంటూ తనకు వైద్యం చేసిన డాక్టర్ భార్యను చంపేశాడు. ఇండోర్ కు చెందిన రఫీక్ కొన్నాళ్లుగా డాక్టర్ రామకృష్ణ వర్మ అనే స్కిన్ స్పెషలిస్ట్ వద్ద చికిత్స పొందుతున్నాడు. గత ఆరు నెలలుగా మందులు వాడుతున్నా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. పైగా జబ్బు మరింత ఎక్కువైంది.

దాంతో, ఇదేంటని ప్రశ్నించేందుకు ఆగ్రహంతో ఆసుపత్రి వద్దకు వెళ్లాడు. అయితే, ఆ సమయంలో డాక్టర్ లేకపోవడంతో, ఆయన భార్యను ప్రశ్నించాడు. తన భర్త ఢిల్లీ వెళ్లాడని ఆమె చెప్పింది. కానీ, అప్పటికే పట్టలేని ఆవేశంతో ఉన్న రఫీక్ డాక్టర్ లేకపోవడంతో మరింత ఉద్రేకానికి లోనయ్యాడు. వెంటనే తన వద్ద ఉన్న కత్తితో డాక్టర్ భార్యను పొడిచాడు. ఆమె అరుపులు విని కొడుకు అభిషేక్ అక్కడికి రావడంతో రఫీక్ ఆ యువకుడ్ని కూడా కత్తితో పొడిచాడు.

అంతలో స్థానికులు వచ్చి రఫీక్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాలపాలైన డాక్టర్ భార్యను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. అటు, 19 ఏళ్ల ఆమె కుమారుడి పరిస్థితి కూడా ఏమీ చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. కాగా, నిందితుడు పాత నేరస్తుడు అని పోలీసులు చెబుతున్నారు. రఫీక్ పై ఇప్పటికే ఓ హత్యకేసు నమోదైందట!

More Telugu News