Telugudesam: టీడీపీ పునాదులు ఎవరూ కదపలేరు: అయ్యన్నపాత్రుడు

  • ‘తెలుగుదేశం’ ప్రజల పార్టీ
  • టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పాటుపడతాం
  • మా కార్యకర్తలపై దాడులు జరిగితే సహించం

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు వెలువడుతున్నాయి. దీనిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘తెలుగుదేశం’ ప్రజల పార్టీ అని, తమకు ప్రజలే అండగా ఉంటారని అన్నారు. టీడీపీ పునాదులు కదిపే శక్తి ఎవరికీ లేదని చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి ఆయన ప్రస్తావించారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై ఓ కమిటీ వేసి నిర్ణయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై ఆయన స్పందిస్తూ, కమిటీ నివేదిక వచ్చాక మాట్లాడతామని స్పష్టం చేశారు. టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పాటుపడతామని చెప్పిన అయ్యన్న పాత్రుడు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్టు చెప్పారు.

More Telugu News