MS Dhoni: ధోనీ అద్దెకిచ్చిన ఇంట్లో దొంగలు.. పట్టుకున్న పోలీసులు!

  • నోయిడాలో ఘటన
  • వరుసగా ఇళ్లు చక్కబెట్టిన దొంగలు
  • విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి ఇంటిని అద్దెకిచ్చిన ధోనీ

నోయిడాలో కొన్నిరోజులుగా వరుస చోరీలు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా, సెక్టార్ 104 అనే ప్రాంతంలో కూడా దొంగలు తమ పనితనం ప్రదర్శించారు. నోయిడాలోని సెక్టార్ 104 అంటే ఎంతో ఖరీదైన ప్రాంతం. ఇక్కడ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి కూడా విలాసవంతమైన ఇల్లు ఉంది. రాంఛీలో నివాసం ఉండే ధోనీ నోయిడాలోని ఇంటిని విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి అద్దెకిచ్చాడు. అయితే, ఆ కాలనీలోని ఇళ్లల్లో వరుసగా దొంగతనం చేస్తూ, ధోనీకి చెందిన ఇంట్లో కూడా చొరబడ్డారు. ఖరీదైన ఎల్ఈడీ టీవీతో పాటు మరికొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారు.

దీనిపై పోలీసులకు అనేక ఫిర్యాదులు అందడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దొంగల కోసం ముమ్మర గాలింపు జరుపగా, ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. వారినుంచి ల్యాప్ టాప్ లు, టీవీలు, ఇన్వర్టర్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, దొంగలు ఓ ఇంట్లో తమ ముఖాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కినట్టు గుర్తించి డిజిటల్ వీడియో రికార్డర్ ను కూడా ఎత్తుకెళ్లారు.  అరెస్టయిన వారిలో ఇద్దరు టీనేజర్లు ఉన్నారు.

More Telugu News